ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాదిగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. గత రెండేళ్లలో ఉదయగిరి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం మొత్తం రూ.1,098.79 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే నాలుగు పరిశ్రమలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వాటి ద్వారా సుమారు నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైందని, యువనేత నారా లోకేష్ కృషితో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్కు దక్కిందని పేర్కొన్నారు. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉదయగిరి పర్యటన సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి మంత్రి అభివృద్ధి పనులను సమీక్షించారు. రూ.1.70 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీ అప్పుల భారం మోపిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అన్నా కాంటీన్లను పునఃప్రారంభించి ప్రతిరోజూ లక్షలాది మంది పేదలకు భోజనం అందిస్తున్నామని, టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కలిగిరి–సంగం రోడ్డు, దుత్తలూరు–కావలి రోడ్డు అభివృద్ధి, నందవరం–ఉదయగిరి రహదారికి నిధుల కేటాయింపు, బనగానపల్లి రోడ్డుకు అటవీ శాఖ అనుమతుల సమస్య పరిష్కారం, ఉదయగిరిలో మరో అన్నా కాంటీన్ ఏర్పాటు వంటి అంశాలను ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమలు, రహదారులు, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను సమన్వయంతో అమలు చేసి ఉదయగిరిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, కూటమి ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news