భారత్ భారీగా ప్రణాళిక చేస్తున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు వాతావరణ మార్పులు పెద్ద సవాల్గా మారే అవకాశముందని తాజా నివేదిక హెచ్చరించింది. జ్యూరిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్, జ్యూరిక్ రిజిలియన్స్ సొల్యూషన్స్ అంచనా ప్రకారం, 2030 నాటికి దేశంలోని ప్రణాళిక దశలో ఉన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో దాదాపు 90 శాతం అధిక లేదా అత్యంత తీవ్రమైన వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ అధ్యయనం 10 రాష్ట్రాల్లోని 871 ప్రాజెక్టు స్థలాలను పరిశీలించింది. వీటి కలిపిన సామర్థ్యం సుమారు 267 గిగావాట్లు.
ఈ ప్రమాదాలు ప్రధానంగా వరదలు, వడగాలులు, అడవి మంటలు, వడగళ్ల వానలు, తీవ్రమైన గాలులు, తుపానుల రూపంలో కనిపించవచ్చని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పరిశీలించిన ప్రాజెక్టుల్లో 593 సౌర ప్రాజెక్టులు ఉండగా, వీటి సామర్థ్యం 1,82,286 మెగావాట్లకు పైగా ఉంది. వడగళ్ల వానల వల్ల సౌర ప్యానెల్ల గాజు పొరలు పగలడం, వెంటనే కనిపించని లోపాలు ఏర్పడి తర్వాత విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయని నివేదిక హెచ్చరిస్తోంది.
గాలి విద్యుత్ ప్రాజెక్టులకు తీవ్రమైన గాలులు, వరదలు, రుతుపవనాల తీవ్రత, తుపానుల ప్రభావం ముప్పుగా మారవచ్చు. జలవిద్యుత్ ప్రాజెక్టుల సంఖ్య తక్కువైనా, వాటి నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటంతో ఆర్థిక నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. చారిత్రక జలప్రవాహాల ఆధారంగా మాత్రమే జలవిద్యుత్ ప్రాజెక్టులను రూపొందించడం ఇక భద్రమైన పద్ధతి కాదని నివేదిక సూచిస్తోంది.
ఈ ముప్పును తగ్గించేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాలని నివేదిక చెబుతోంది. ప్రాజెక్టులు ఇంకా ప్రణాళిక లేదా నిర్మాణ దశలో ఉన్నందున, వాతావరణ ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి డిజైన్, స్థల ఎంపిక, కొనుగోలు ప్రమాణాలు, మౌలిక వసతుల బలపర్చడంలో మార్పులు చేయవచ్చని సూచించింది. మొత్తం పెట్టుబడిలో సుమారు 2 శాతం అంటే 4.6 బిలియన్ డాలర్ల మేర రిజిలియన్స్ చర్యలకు కేటాయిస్తే, భవిష్యత్తులో 55 బిలియన్ డాలర్ల వరకు ఉండే నష్టాన్ని 27 బిలియన్ డాలర్లకు తగ్గించవచ్చని అంచనా వేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news