ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక రైతేనని, సమాజానికి అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేస్తూ, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఏరువాక పౌర్ణమి రైతులు తమ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే పవిత్రమైన పండుగ అని మంత్రి పేర్కొన్నారు. భూమిని, పశుసంపదను పూజిస్తూ ప్రకృతితో మమేకమయ్యే ఈ సంప్రదాయం భారతీయ వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రతి రైతు ఇంట పాడిపంటలతో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సేద్యం అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, కోట్లాది మంది ఆకలి తీర్చే మహాయజ్ఞమని మంత్రి దుర్గేష్ అన్నారు. రైతు నాగలి పట్టి పొలంలో అడుగు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి వస్తుందని, వ్యవసాయం దేశ ప్రగతికి మూలస్తంభమని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయాధారిత ప్రాంతమైన నిడదవోలు నియోజకవర్గంలో ఏరువాక వేడుకలను ఘనంగా నిర్వహించాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, కేవలం 6 గంటల నుంచి గరిష్టంగా 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే వ్యవస్థను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించకుండా నిలిచిపోయిన ధాన్యం బకాయిలను కూడా ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా చెల్లించి రైతులకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో వినియోగించేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పండిన పంటలకు సరైన మార్కెట్ అనుసంధానం కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రైతులకు చేదోడువాదోడుగా నిలిచే పశుసంపద సంరక్షణకు ప్రభుత్వం 'గోకులాలు' నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందితే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భూమి సారాన్ని కాపాడేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో సాగు చేయడం వల్ల భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని రైతులకు సూచించారు.
శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సూచనలు, సలహాలను పాటిస్తూ రైతులు కొత్త సాగు విధానాలను అవలంబించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
చివరగా, కోట్లు సంపాదించే వ్యక్తి కూడా చివరకు తినేది అన్నమేనని, ఆ అన్నాన్ని పండించి ప్రతి ఇంటికి చేరవేసే రైతు దేవుడితో సమానమని మంత్రి దుర్గేష్ అన్నారు. 'అన్నదాత సుఖీభవ' అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వ విధానమని పేర్కొంటూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news