ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా నాణ్యమైన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలతతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 111 అర్జీలు అందగా, వాటిలో 25 రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మిగిలిన 86 ఇతర శాఖలకు సంబంధించినవిగా గుర్తించారు. ప్రతి అర్జీపై సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
కురుపాం, సీతానగరం, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, విద్యుత్ సమస్యలు, సబ్సిడీ పథకాలు, సదరం స్లాట్ సమస్యలు వంటి వివిధ అంశాలపై అర్జీలు సమర్పించారు. రెవెన్యూ సమస్యలలో భూ ఆక్రమణలు, సర్వే లోపాలు, పట్టాల మంజూరు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు.
పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో నిర్వహిస్తోందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news