అత్యాచార కేసుల విచారణలో బాధితురాలి వైద్య నివేదికను తప్పుగా అర్థం చేసుకుని ఆమె విశ్వసనీయతను ప్రశ్నించే ధోరణికి అలహాబాద్ హైకోర్టు గట్టి చెక్ పెట్టింది. హైమెన్ (కన్యత్వపొర) చిరిగిపోయి ఉందనే కారణంతో మాత్రమే బాధితురాలు తప్పుడు సాక్ష్యం చెబుతోందని లేదా ఆమెపై అత్యాచారం జరగలేదని నిర్ణయించలేమని కోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం అనేది చట్టపరమైన అంశమని, అది కేవలం వైద్యపరమైన పరీక్షలతో నిర్ణయించే విషయం కాదని పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం నమ్మదగినదిగా ఉంటే, కేవలం మెడికల్ రిపోర్టులోని ఒక అంశాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడికి అనుమాన లాభం ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. 1982లో జరిగిన అత్యాచార కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ, దాదాపు 44 ఏళ్ల తర్వాత ఈ కీలక తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది, బాధితురాలి హైమెన్ ముందే చిరిగిపోయి ఉందని, ఆమెకు ఇప్పటికే శారీరక సంబంధాలు ఉన్నాయని వాదించారు. అయితే ఈ వాదనను హైకోర్టు పూర్తిగా తిరస్కరించింది. హైమెన్ అనేక కారణాల వల్ల చిరిగిపోవచ్చని, క్రీడలు ఆడటం, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, గుర్రపు స్వారీ, శారీరక శ్రమ లేదా ప్రమాదాల వల్ల కూడా అది దెబ్బతినే అవకాశం ఉందని కోర్టు వివరించింది. కొంతమంది మహిళలు పుట్టుకతోనే హైమెన్ లేకుండా జన్మిస్తారని, మరికొందరిలో అది సాగే స్వభావంతో ఉంటుందని కూడా గుర్తుచేసింది. కాబట్టి హైమెన్ పరిస్థితిని మాత్రమే ఆధారంగా చేసుకుని బాధితురాలి వ్యక్తిత్వాన్ని లేదా ఆమె వాంగ్మూలాన్ని అనుమానించడం చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం వంటి నేరాలు సాధారణంగా ఏకాంత ప్రదేశాల్లో జరుగుతాయని, ప్రత్యక్ష సాక్షులు దొరకడం చాలా అరుదని పేర్కొంది. అందువల్ల బాధితురాలి వాంగ్మూలం విశ్వసనీయంగా ఉంటే దానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడి బెయిల్ను రద్దు చేసిన హైకోర్టు, మిగిలిన శిక్షను అనుభవించేందుకు 10 రోజుల్లోగా ట్రయల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు అత్యాచార కేసుల్లో బాధితురాలి గౌరవం, హక్కులు, విశ్వసనీయతకు మరింత రక్షణ కల్పించే చారిత్రాత్మక నిర్ణయంగా న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news