రాష్ట్రంలో తాటి ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం అందించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రంపచోడవరం మండలం పందిరిమామిడిలో పర్యటించిన మంత్రి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన తాటి ఉత్పత్తుల తయారీ పరిశ్రమను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉద్యాన పరిశోధనా కేంద్రంలో తయారు చేస్తున్న వివిధ తాటి ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. నీరా, తాటి బెల్లం, తాటి పానకం వంటి ఉత్పత్తులను స్వయంగా రుచి చూసి వాటి నాణ్యత, తయారీ విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ సమీపంలోని తాటి తోటలను కూడా పరిశీలించిన మంత్రి, తాటి సాగు విస్తరణ, ఉప ఉత్పత్తుల తయారీపై అధికారులతో చర్చించారు.
అత్యాధునిక సాంకేతికతతో నీరా తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో నిడదవోలులో తాటి బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించామని గుర్తు చేశారు. ప్రస్తుతం రంపచోడవరంలో ఆధునిక పద్ధతుల్లో తాటి ఉత్పత్తుల తయారీ జరుగుతుండటం సంతోషకరమైన విషయమని తెలిపారు.
తాటి ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఖాదీ బోర్డు, టొబాకో బోర్డు తరహాలో తాటి ఉత్పత్తుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. తాటి ఉత్పత్తుల ద్వారా గీత కార్మికులకు అదనపు ఆదాయం కల్పించడంతో పాటు సంప్రదాయ వృత్తిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని మంత్రి అన్నారు. రంపచోడవరంలోని ఈ పరిశోధన కేంద్రానికి నాడు ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు కొనసాగించాలని ఆయన సూచించారని గుర్తు చేశారు.
తాటి ఉత్పత్తుల్లో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నీరాకు మంచి డిమాండ్ ఉందని, ఆ అవకాశాలను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. కేరళలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, శ్రీలంకలో బెల్లం, పంచదార వంటి ఉత్పత్తులకు మంచి గుర్తింపు ఉందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తాటి ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
అరకు కాఫీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విధంగానే తాటి ఉత్పత్తులకు కూడా అదే స్థాయి గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న సమాజంలో మళ్లీ సంప్రదాయ ఉత్పత్తుల వినియోగం వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు కోట్లకు పైగా తాటి చెట్లు ఉన్నాయని మంత్రి వివరించారు. తాటి చెట్ల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి తాటి సాగు విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. తాటి ఉత్పత్తుల ద్వారా వారికి అదనపు ఆదాయం కల్పించడంతో పాటు గీత వృత్తిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూల్ డ్రింక్స్ తరహాలో నీరా ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
1986లోనే నందమూరి తారక రామారావు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా పరిశోధన కేంద్రానికి శ్రీకారం చుట్టారని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిశోధన ఫలితాలను ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
తాటి ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, విస్తరణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. సంప్రదాయ వృత్తులను కాపాడుతూ ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news