ప్రియురాలితో ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు.. ప్రమాదం కాదు, హత్యే!
Updated 3 days ago
మహారాష్ట్రలోని పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద తొలుత ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించిన యువకుడి మృతి కేసు సంచలన హత్యగా మారింది. 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ ట్రెక్కింగ్ సమయంలో 400 అడుగుల లోయలో పడి చనిపోయినట్లు మొదట పోలీసులు భావించారు. అయితే దర్యాప్తులో అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రహస్య ప్రేమ సంబంధానికి కేతన్ అడ్డుగా మారడంతో అతడిని తొలగించాలనే ఉద్దేశంతో పలుమార్లు ప్రయత్నించి, చివరకు లోహగడ్ కోటకు తీసుకెళ్లి లోయలోకి తోసేసినట్లు విచారణలో వెల్లడైంది. కుటుంబ సభ్యుల అనుమానాలు, సీసీటీవీ ఆధారాలు, ఇతర సాక్ష్యాలతో ఈ కేసు మలుపు తిరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి మరిన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.