టీజీ20 లీగ్ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఛాంపియన్గా నిలవడం వెనుక ఉన్న అసలు విజయ రహస్యాన్ని జట్టు యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే స్టార్ హోదా పొందిన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం కంటే, ప్రతిభ, పట్టుదల, నేర్చుకోవాలనే తపన ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అసాధారణ విజయాలు సాధించవచ్చని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం తమ ఆలోచనకు నిదర్శనమని పేర్కొన్నారు.
ట్రోఫీ విజయం అనంతరం ఈటీవీ డైరెక్టర్ సుజయ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జట్టు ఏర్పాటుకు వెనుక ఉన్న లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పం, టీజీ20 టైటిల్ సాధించిన అనుభూతి గురించి వివరించారు. ఈనాడు గ్రూప్ ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న "లక్ష్య" కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని యువ క్రీడాకారులను గుర్తించి వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. క్రికెట్తో పాటు పలు క్రీడల్లో వేలాది మంది యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా ఎంతోమంది జాతీయ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.
ఈటీవీ డైరెక్టర్ సుజయ్ మాట్లాడుతూ, ఇప్పటికే గుర్తింపు పొందిన ఆటగాళ్లపై ఆధారపడటం కంటే, ఎదగాలనే తపన ఉన్న యువతను తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సరైన శిక్షణ, ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం కల్పిస్తే వారే భవిష్యత్తులో స్టార్లుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ప్రతి మ్యాచ్కు ముందు, మ్యాచ్ అనంతరం ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించామని వెల్లడించారు. మైదానంలో లభించే అవార్డులతో పాటు డ్రెస్సింగ్రూమ్లోనూ ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహాన్ని నింపామని చెప్పారు. అయితే ఈ టైటిల్కు పూర్తి క్రెడిట్ ఆటగాళ్లకేనని స్పష్టం చేశారు.
ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి మాట్లాడుతూ, ఈ విజయం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. వరుస విజయాల తర్వాత ఎదురైన ఒక్క పరాజయం జట్టును మరింత బలంగా మార్చిందని, అదే ఫైనల్లో అద్భుతమైన పునరాగమనానికి కారణమైందని తెలిపారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయమే లక్ష్యంగా ప్రతి ఆటగాడు ఆడటమే ట్రోఫీని అందించిందని పేర్కొన్నారు. జట్టులోని ఐక్యత, క్రమశిక్షణ, పరస్పర సహకారం విజయానికి ప్రధాన కారణాలని చెప్పారు.
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలన్న లక్ష్యంతో ఛైర్మన్ కిరణ్ గత 20 ఏళ్లుగా అనేక క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా అదే ఆలోచనలో భాగంగా ఏర్పడిన జట్టేనని చెప్పారు. ఈ విజయానికి ఛైర్మన్తో పాటు ఆటగాళ్లు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరూ సమానంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్ను వేలాది మంది ప్రత్యక్షంగా వీక్షించడం తెలంగాణలో క్రీడలపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు సరైన వేదిక కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఛాంపియన్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీజీ20 తొలి సీజన్ ఫైనల్లో ఖమ్మం ఏసెస్పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.4 ఓవర్లలోనే ఛేదించి తొలి ఛాంపియన్గా చరిత్ర సృష్టించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, వైష్ణవ్ రెడ్డి 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. షణ్ముఖ్ అశ్విన్ 36 పరుగులతో జట్టుకు అండగా నిలవగా, బౌలింగ్లో యశ్వీర్ గౌడ్ మూడు వికెట్లు తీసి విజయానికి బాటలు వేశాడు.
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం కేవలం ఒక ట్రోఫీతో ముగిసిపోయే కథ కాదని, గ్రామీణ యువతకు అవకాశాలు కల్పించి వారి కలలను సాకారం చేసే వేదికగా ఈ జట్టు నిలుస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిభను నమ్మితే విజయం తప్పకుండా వస్తుందనే సందేశాన్ని తమ జట్టు మరోసారి నిరూపించిందని పేర్కొంది. భవిష్యత్తులో మరింత మంది యువ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తమ ప్రయాణం కొనసాగుతుందని, ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతామని యాజమాన్యం వెల్లడించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news